ఎంత దూరం
How to achieve success in life
పానకాలు, ఫణిభూషణం, పరమేశ్వరం అనే ముగ్గురు వ్యక్తులు తమ రాజ్యంలోని మహారాజు నిర్వహిస్తున్న ఒకానొక పోటీలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో చేరుకున్నారు. అయితే పాల్గొనేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ముందుగా ఎంపిక ప్రక్రియను నిర్వహించి సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసారు రాజ సిబ్బంది.
ఎట్టకేలకు అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక మొత్తం పోటీదారుల నుండి పానకాలు, పరమేశ్వరం మరియు ఫణిభూషణం వీరు ముగ్గురు మాత్రమే మరుసటి రోజు నిర్వహించే పోటీలో పాల్గొనడానికి ఎంపిక చేయబడ్డారు.

స్వయంగా మహారాజు నిర్వహిస్తున్న కార్యక్రమం అయినందున రాజ సిబ్బంది ఆ రాత్రి సకల సౌకర్యాలతో వారికి అక్కడే ఆతిధ్యాన్ని ఏర్పాటు చేసారు. అది వారి జీవితంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని గొప్ప ఆడంబరమైన మరియు విలాసవంతమైన ఆతిధ్యం. ఇటువంటి కోటలో సేవకుడిగా బ్రతికినా జన్మ ధన్యం అనిపిస్తోంది, ఏమంటారు మిత్రులారా? అని పానకాలు అన్నాడు. మిగిలిన ఇద్దరూ నిజమే అన్నట్టు తలను ఊపారు. విందు వినోదాల అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు.
మరుసటి రోజు ఉదయాన్నే రాజ సిబ్బంది వారిని మహారాజు సభా ప్రాంగణానికి తీసుకుని వెళ్ళారు. చుట్టూ ప్రాంగణంలో జనం గూమిగూడి ఉన్నారు. మహారాజు ప్రతీ ఏడాది నిర్వహించే ఈ పోటీ ద్వారా ప్రజలకు ఎదో ఒక సందేశాన్ని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో, అది తమ జీవితాలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో అని ప్రజలు ఆశక్తిగా తిలకిస్తున్నారు.
అంతలో కొందరు సిబ్బంది మూడు బరువైన సంచులని తీసుకువచ్చి ఆ ముగ్గురు వ్యక్తుల వీపుకి తగిలించారు. తర్వాత ఒక రాజభటుడు వచ్చి కొన్ని నియమాలను వారికి ఇలా తెలియజేసాడు.
“ఈ సంచులలో కొన్ని ఆహార పదార్ధాలు మరియు పానీయాలు ఉన్నాయి. ఈ సంచులను తీసుకుని మీరు ఇక్కడ నుండి కాలినడకన నడుచుకుని మహేంద్రగిరి కొండలలోని మన ఈశాన్య దుర్గం వద్దకు చేరుకోవాలి. మీకు భౌతిక పరమైన రక్షణ కల్పించేందుకు కొందరు అశ్వకదల సైన్యం మీ వెంట వస్తారు. అయితే ఈ సందర్భంలో మీరు మీ శరీర పోషణ నిమిత్తం ఈ సంచులలోని ఆహార పదార్ధాలు మరియు పానీయాల మినహా మరి ఏ ఇతర బాహ్య వస్తువులను స్వీకరించరాదు. అలాగే ఒకరి సంచిలోని ఆహారాన్ని మరొకరు తాకరాదు. ఈ నియమాలకు లోబడి ఎవరైతే నిర్దేశించిన లక్ష్యానికి చేరుకుంటారో వారు విజయం సాధించినట్టు. విజయం సాధించిన వ్యక్తికి ఒక ఉన్నతమైన రాజుద్యోగిగా ఈ కోటలో అధికారం కల్పించబడుతుంది” అని చెప్పాడు.

ఆ ముగ్గురు వ్యక్తులు తమ గెలుపు మీద ఆత్మ విశ్వాసంతో ఈశాన్య దిశ వైపుకి గుర్రాలపై వస్తున్న సైనికుల వెంట అనుసరిస్తూ నడవటం ప్రారంభించారు. మిత్రులారా మన ప్రయాణం ఎంత సమయం ఉండవచ్చు అని పానకాలు మిగిలిన ఇద్దర్నీ అడిగాడు. వాళ్ళు తెలియదు అన్నట్టు తలను ఊపారు.
మార్గమధ్యం అంతా అటవీ ప్రాంతం కావడంతో ఎండ దెబ్బ తగలకుండా నీడపట్టున నడిచారు. మధ్యాహ్న సమయం అయింది. అంతలో అశ్వకదళ సైన్యం గుర్రాలను నిలిపి వారు తెచ్చుకున్న ఆహారాన్ని తినడం ప్రారంభించారు. పరమేశ్వరం అప్పటికే బాగా ఆకలితో ఉన్నాడు. వెంటనే అతడు కూడా ఒక చెట్టు మొదల్లో తన సంచిని దించి దానిని తెరిచాడు.
అద్భుతమైన ఆహార పదార్ధాలను చూడగానే పరమేశ్వరం ఆకలి రెట్టింపు అయింది. ఇక ఉపేక్షించడం వృధా అని భావించి కడుపు నిండా సంతృప్తిగా భుజించాడు. తర్వాత హాయిగా ఐదు నిముషాలు సేద తీరి తిరిగి నడవడం ప్రారంభించాడు. అతని సంచి సగానికి పైగా బరువు తగ్గింది. అందువల్ల అతనికి నడవడం కాస్త సులభంగా అనిపించింది.
పరమేశ్వరం వెంటనే ఫణిభూషణం వద్దకు వచ్చి మిత్రమా! నీ వద్ద ఉన్న సంచిలో నిన్నటి విందుకు మించి కమ్మనైన ఆహార పదార్ధాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే చాలా సేపు నడచి ఆకలి మరియు దప్పికలతో ఉన్నట్టు నీరసంగా కనిపిస్తున్నావు. కాబట్టి నీవు కూడా సంతృప్తిగా భుజించి, ఆపై శక్తిని పుంజుకుని తిరిగి నడవటం శ్రేయష్కరం అని సూచన చేసి వెళ్ళిపోయాడు.
పరమేశ్వరం సూచన మేరకు ఫణిభూషణం తన వీపున ఉన్న సంచిని క్రిందకు దించి ఆహార పదార్ధాల మూటను తెరిచాడు. పరమేశ్వరం చెప్పినట్టు అద్భుతమైన వంటకాల ఘుమఘుమలు అతనిలో ఆకలిని రెట్టింపు చేసాయి.
పళ్ళెం నిండా ఆ వంటకాలను వడ్డించుకుని నోటిలో పెట్టుకునే ముందు అతడికి ఒక అనుమానం కలిగింది. ఈశాన్య దుర్గానికి ఈ నడక ప్రయాణం ఎన్ని దినములు ఉంటుందో తెలియదు. అతని దగ్గర ఉన్న ఈ ఆహార పదార్ధాలు సంతృప్తిగా భుజిస్తే బహుషా రెండు రోజులకు సరిపడా మాత్రమే. కాబట్టి అతడు తన మనుగడకు అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుని మిగిలింది దాచిపెట్టుకోవడం శ్రేయష్కరం అని అనుకున్నాడు.
ఫణిభూషణం అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే భుజించి మిగిలింది తిరిగి సంచిలో పెట్టుకున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక అతనిలో శక్తి తిరిగి పుంజుకుంది. నూతన ఉత్సాహంతో అతడు తిరిగి నడవడం ప్రారంభించాడు.
ఇంతలో అతడికి నీరసించి నడుస్తున్న పానకాలు ఎదురైనాడు. భోజనం ముగించి తర్వత నడక సాగించడం శ్రేయష్కరమని ఫణిభూషణం పానకాలకు హితవు పలికి వెళ్ళిపోయాడు.
పానకాలు కూడా ఒక చెట్టు నీడకు వెళ్ళి సంచిని క్రిందకు దించాడు. అందులోని ఘుమ ఘుమలాడే ఆహార పదార్ధాలను చూసి “ఆహా! ఎంత కమ్మటి భోజనం. కానీ ఈ ప్రయాణం యొక్క నిడివి ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను ఇప్పుడే దీనిని భుజిస్తే రేపు అవసరమైనప్పుడు భుజించడానికి నా వద్ద ఏమీ ఉండదు. కనుక ప్రస్తుతానికి ఈ పానీయం సేవించి నడక ప్రారంభించడం ఉత్తమం” అనుకుని అతడు కేవలం నీటిని త్రాగి తిరిగి నడకను ప్రారంభించాడు.
ప్రయాణిస్తూ ఉండగా చీకటి పడింది. సైనికులు ఒక చోట బస చేసి భోజనాలు చేసేందుకు సిద్దమయ్యారు. పరమేశ్వరానికి వెంటనే తన సంచి గుర్తుకు వచ్చింది చక చక సంచి తెరిచి గిన్నె నిండుగా వడ్డించుకుని సంతృప్తిగా భుజించాడు. కడుపు నిండిన పరమేశ్వరానికి మత్తుగా నిద్ర ముంచుకు వచ్చింది. ఆవులింతలు తీస్తూ అక్కడే ప్రక్కకి ఒరిగాడు.
Read More Stories about How to Achieve Success in Life
- ఈ కథలను కూడా చదవండి
- ప్రాణం ఖరీదు – Best Self Motivation Story
- ఏది విజయం – Inspiring Stories of Success
- గుప్త నిధి – గుడ్డి లక్ష్యం – Best motivational story in telugu
- క్రోధం – Best motivatonal story in telugu
ఫణిభూషణం కూడా తన సంచిని తెరచి భోజనం బయటకి తీసాడు. తక్షణ శక్తి కొరకు కొద్ది పాటి ఆహారం తిని తిరిగి మిగిలింది సంచిలో దాచి నిద్రపోయాడు.
అందరూ దాదాపుగా నిద్రపోయారు. పానకాలు మాత్రం ఏమీ భుజించలేదు. ఆకలి బాగా ఎక్కువ ఉండటం వలన అతడికి నిద్ర పట్టలేదు. కానీ ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఆహారాన్ని దాచుకోవాలని అనుకున్నాడు. ఆ రాత్రి కూడా కేవలం పానీయాలతో సరిపెట్టుకున్నాడు.
మరుసటి రోజు ఉదయాన్నే అందరూ నిద్రలేచి, కాలకృత్యాల అనంతరం సైనికులు అల్పాహారం ఆరగించడం ప్రారంభించారు. పరమేశ్వరం వెంటనే తన సంచిని తెరిచి చూసాడు. అందులో సంతృప్తిగా భుజించడానికి ఒక పూటకు సరిపడే ఆహారం మరియు నీరు మాత్రమే మిగిలి ఉంది. అయినా గెలవాలంటే ముందుగా నేను ఉండాలి కదా అనుకుని మరో ఆలోచన చేయకుండా కడుపు నిండా భుజించి నడవడానికి సిద్దమయ్యాడు.
ఫణిభూషణం కూడా స్వల్పంగా ఆహారం తిని గుక్కెడు నీల్లు త్రాగి తిరిగి ప్రయాణానికి సిద్దమయ్యాడు. పానకాలు మిగిలిన ఇద్దరి సంచుల వైపు చూసాడు. తర్వాత తన సంచిని చూసాడు. నా కష్టానికి తగిన ప్రతిఫలం నా సంచిలోనే కనిపిస్తోంది. బహుశా వాళ్ళిద్దరూ రేపటితో ఆహారం లేక గమ్యానికి చేరుకోలేరు. నాకు మాత్రం ఆ సమస్య లేదు. ఈ పూటకు మిగిలిన ఈ మంచినీళ్ళతో సరిపెట్టుకుని మధ్యాహ్నం కాస్త ఆహారం భుజించవచ్చు అని అనుకున్నాడు.
మంచినీళ్ళు త్రాగి పానకాలు నడవడం ప్రారంభించాడు. ఆరోజు ఎండ తాకిడి ఎక్కువగా ఉంది. పరమేశ్వరం సాధారణంగా భుజించడం వలన శక్తి పుంజుకుని ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తున్నాడు. ఫణిభూషణం కాస్త నీరసం అనిపించినా గుక్కెడు మంచినీళ్ళు త్రాగి తిరిగి ఉత్సాహంగా నడుస్తున్నాడు. పానకాలకు నీరసంతో పాటు తీవ్రమైన దాహం కమ్మేసింది. సంచిలో ఎంత వెతికి చుసినా చుక్క మంచినీరు కూడా లేదు.
మిట్ట మధ్యాహ్నం అయినందున సైనికులు గుర్రాలను ఆపి తిరిగి రుచికరమైన ఆహార పదార్ధాలను వడ్డించుకుని భుజించడం ప్రారంభించారు. పరమేశ్వరం తన సంచిని వెతికాడు. అందులో ఒక్క అరటిపండు తప్ప ఏమీ లేదు. ఈ పూటకు ఇదే ఆహారం, సరిపెట్టుకోక తప్పదు అని దానిని ఆరగించాడు.
ఫణిభూషణం ఎప్పటిలాగానే తనకు శక్తినివ్వడానికి సరిపడినంత ఆహారం మరియు నీళ్ళు త్రాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.
నీరసించి కళ్ళు బైర్లు కమ్మేస్తూ ఉండటంతో పానకాలు కూడా ఒక చెట్టు కింద సేద తీరి ఏదైనా తిందామని అనుకున్నాడు. కానీ అతడిని తీవ్రమైన దాహం కమ్మేసింది. కష్టపడి నెమ్మదిగా సంచిని తెరిచాడు. కానీ అతడికి ఎటువంటి ఆహారం సహించడం లేదు. నీళ్ళు కావాలని గట్టిగా అరిచి మూర్చపోయాడు.

సైనికులు వెంటనే పరిగెత్తుకు వచ్చి మొహం మీద నీళ్ళు చల్లారు. స్పృహలోకి వచ్చిన అతడికి తీవ్రమైన శక్తి క్షీణత వలన అతడి శరీరంలో చలనం లేనందున అతడి సంచిలోని ఆహారాన్ని అతడికి తినిపించే ప్రయత్నం చేసారు. శరీరానికి నీరు లేనందున ఆహరం అతడి గొంతు దిగడం లేదు. వెంటనే సైనికులు క్షమించు మిత్రమా, ఇక నీవు నియమాలను ఉల్లంఘించక తప్పదు అని మంచినీళ్ళు తెప్పించి త్రాగించారు. అయినా అతడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
పానకాలు మరణానికి చింతిస్తూ మిగిలిన వారు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. సాయంత్రం సమయం అయింది. పరమేశ్వరానికి దాహం తీవ్రత పెరుగుతూ వస్తోంది. అతడి కళ్ళ ముందు పానకాలు మరణం ఇంకా కదలాడుతూనే ఉంది. అతడిలో ఆందోళన పెరగడం ప్రారంభం అయింది. కళ్ళు నెమ్మదిగా తిరగడం ప్రారంభం అయ్యాయి.
విజయం సాధించాలంటే నిభంధనలను ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించరాదు. ప్రాణం కంటే విలువైన విజయం మరొకటి ఉంటుందా అని ఆలోచిస్తూ సైనికుని చేతిలోని నీటి సంచిని తీసుకుని గబ గబా త్రాగేసాడు. వెంటనే స్పందించిన సైనికుడు పరమేశ్వరం నీవు నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు అని గుర్తుచేసాడు. పరమేశ్వరం తనకు మరో అవకాశం లేదని చెబుతూ పోటీ నుండి తప్పుకున్నాడు.
ఇక చివరిగా మిగిలింది ఫణిభూషణం. సైనికులంతా చీకటి పడడంతో ఒక దగ్గర బస ఏర్పాటు చేసుకుని భోజనాలకు సిద్దమయ్యారు. విజయం సంగతి అటు ఉంచి పరమేశ్వరం కూడా వాళ్ళతో లొట్టలేసుకుంటూ కూర్చున్నాడు. ఫణిభూషణం ఎప్పటిలాగానే పోషణకు సరిపడే ఆహారాన్ని భుజించి గుక్కెడు నీళ్ళు త్రాగాడు. సందేహంతో ఒకసారి మిగిలిన ఆహారాన్ని చూసుకున్నాడు. ఇంకా ఒక పూటకు సరిపడా ఆహారం మాత్రమే మిగిలి ఉంది.
మరుసటి రోజు ఉదయాన్నే అందరూ లేచి తిరిగి ప్రయాణానికి సిద్దమయ్యారు. పరమేశ్వరం వెనక్కి వెళ్ళలేక, ముందుకు నడవలేక అవస్థలు పడుతూ ఉన్నాడు. అంతలో అక్కడికి పదిహేను నిముషాల నడక దూరంలో ఈశాన్య దుర్గం కనిపించింది.

ఒక్క రాత్రి ఓపికతో ఉంటే రాజకొలువు ఉద్యోగాన్ని పొందేవాడినే అని పరమేశ్వరం బోరున ఏడ్చాడు. ఫణిభూషణం ఆనందంతో ఈశాన్య దుర్గం వైపుకి అడుగులు వేసాడు. కోట ద్వారం వద్ద అతడి విజయానికి శుభాకాంక్షలు చెబుతూ పరిచారకులు ఎదురు చూస్తూ కనిపించారు.
రెండు రోజుల తర్వాత లాంచనప్రాయంగా ఫణిభూషణం రాజ కొలువుకి చేరుకున్నాడు. మహారాజు అతడి విజయానికి ప్రశంశగా ప్రజా సభను ఏర్పాటు చేసాడు. జనం వేల సంఖ్యలో సభా ప్రాంగణాన్ని అలంకిరించారు.
ముందుగా సభకు నమస్కారాన్ని తెలియజేస్తూ మహారాజు ప్రజలకి తన సందేశాన్ని ఈ విధంగా తెలియజేసాడు.
Best Stories about How to achieve success in life
- ఈ కథలను కూడా చదవండి
- ప్రాణం ఖరీదు – Best Self Motivation Story
- ఏది విజయం – Inspiring Stories of Success
- గుప్త నిధి – గుడ్డి లక్ష్యం – Best motivational story in telugu
- క్రోధం – Best motivatonal story in telugu
అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పానకాలు తన ప్రాణాలను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఇది నేను అతడికి ఇచ్చిన ఆహారపు సంచి. రెండు రోజుల ప్రయాణంలో అతడు ఒక్క పూట ఆహారాన్ని కూడా భుజించలేదు.
ఇక రెండవ సంచి పరమేశ్వరంకి సంబంధించినది. ఈ సంచిలో ఏమైనా ఉందేమో చూద్దాం అని మహారాజు దాన్ని త్రిప్పి త్రిప్పి చూసాడు. అరె! పూర్తి ఖాళీగా ఉన్నది. మరొక గొప్ప విషయం ఏమిటంటే అతడు ఈ సంచిలో ఉంచిన రెండు రోజుల భోజనాన్ని ఒక రోజులోనే భుజించగలిగాడు అన్నాడు. జనం ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ నవ్వారు. పరమేశ్వరం సిగ్గుతో తలను దించుకున్నాడు.
తర్వాత మూడవ సంచిని బయటకి తీస్తూ ఇది ఫణి భూషణం యొక్క సంచి. ఇందులో ఇంకా ఒక పూటకు సరిపడే ఆహారం అలాగే నీరు మిగిలి ఉంది. మూడు సంచుల వైవిధ్యత మధ్య మీరు ఏమైనా గమనించారా అని మహారాజు ప్రజల వైపుకి చూసి ప్రశ్నించాడు.
ప్రజలు ఏమీ అర్ధంకాక సందేహంగా అతడిని చూస్తున్నారు. మహారాజు తిరిగి మాట్లాడుతూ ఈరోజు మీకు పొదుపరి, పిసినారి మరియు వృధాకారుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేయబోతున్నాను.
పొదుపు అంటే వృధాను తగ్గించడం, కానీ పిసినారి అంటే అవసరాలను కూడా తగ్గించడం. అది ఎటువంటి పర్యావసనాలకు దారితీస్తుందో తెలుసుకోవడానికి పానకాలు జీవితమే ఉదాహరణ. అతడు తన అవసరాన్ని గుర్తించకుండా అత్యాశతో దాచుకున్న ఆహారమే అతడి ప్రాణాలను తీసింది. భవిష్యత్తు కోసం దిగులుపడుతూ ఉన్న జీవితాన్ని దుర్లభం చేసుకుంటున్నవారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వారందరి కోసమే ఈ సందేశం.
తర్వాత మాట్లాడాల్సి వస్తే వృధాకారి గురించి చెప్పాలి. అవసరానికి మించి ఉపయోగించడం వృధాకారి లక్షణం. పరమేశ్వరానికి సరిగ్గా రెండు రోజులకు సరిపడే ఆహారాన్ని ఇచ్చినప్పుడు అతడు ఒక రోజులోనే దాన్ని భుజించి తిరిగి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈరోజు సమాజంలో ఎంతో మంది తమ చేతి నిండా డబ్బు సంపాదించినా ఇంకా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దానికి కారణం వారిలోని ఈ లక్షణమే.
చివరిగా పొదుపరి. ఫణిభూషణం తనకు ఇచ్చిన రెండు రోజుల ఆహారం నుండి ఒక పూట ఆహారాన్ని చివరిగా మిగులు చూపించగలిగాడు. మీ ఆదాయం మీ ఖర్చులకు సమానంగా ఉన్నప్పటికీ కేవలం వృధాలను తగ్గించడం ద్వారా ఎలా పొదుపు చేయవచ్చునో ఫణిభూషణం ఇక్కడ నిరూపించి చూపించాడు.
How to achieve success in life
ఒక నిర్దిష్ట ప్రయాణం. దానికి కావాల్సిన ఆహారం మరియు నీరు సమకూర్చడం జరిగింది. కేవలం మనిషి స్వభావం మాత్రమే ఇక్కడ గెలుపు ఓటములను నిర్ణయించింది. దారిలో లక్ష్యాన్ని దారి మళ్ళించడానికి ఆకలి అనే వ్యామోహంలో మిమ్మల్ని పడవేసేందుకు సైనికులు రుచికరమైన ఆహార పదార్ధాలను ఆశ చూపించారు. అలాగే మీ లక్ష్య సాధనలో కూడా ఎన్నో వ్యామోహాలు మిమ్మల్ని దారి మళ్ళించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని ధృడ నిశ్చయంతో కొనసాగిన నాడే విజయం సాధించగలుగుతారు అని చెప్పి మహారాజు సభను ముగించాడు.
.